రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్
ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన ఆరోపణలపై ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
ప్లాట్ తనదేనంటూ నమ్మించి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జాధవ్ నౌసీలాల్ తన తండ్రికి 2018లో వచ్చిన రిటైర్మెంట్ ప్రయోజనాలతో పట్టణంలో ప్లాట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పరిచయస్తుడైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ దరాడే కేశవ్ (43)ను సంప్రదించారు.
కేశవ్.. SRR టౌన్షిప్లోని సర్వే నంబర్ 90లో ఉన్న ప్లాట్ నంబర్ 27 తనదేనని, దానిని విక్రయిస్తానని నౌసీలాల్ను నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ ధరను రూ.7.70 లక్షలుగా నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.
విడతల వారీగా డబ్బులు చెల్లింపు
ప్లాట్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా 2020 జనవరి 30న రూ.3 లక్షలను చెక్కు ద్వారా, అదే ఏడాది ఏప్రిల్ 26న మరో రూ.70 వేల నగదును నౌసీలాల్ చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని పలుమార్లు కోరినప్పటికీ కేశవ్ వివిధ కారణాలు చెబుతూ రిజిస్ట్రేషన్ను వాయిదా వేస్తూ వచ్చినట్లు ఆరోపించారు.
2023 జనవరిలో మరోసారి రిజిస్ట్రేషన్ గురించి అడగగా ప్లాట్ ధర పెరిగిందని, అదనంగా రూ.2 లక్షలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని కేశవ్ చెప్పినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో జనవరి 23, 2023న అదనంగా రూ.2 లక్షలు చెల్లించినప్పటికీ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయలేదని, తీసుకున్న నగదును తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇతరులకు కూడా ప్లాట్ చూపించాడని ఆరోపణ
తాను కొనుగోలు చేయాలనుకున్న అదే ప్లాట్ను ఇతరులకు కూడా చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితుడు ఆరోపించారు. అంతేకాకుండా ప్లాట్కు సంబంధించిన LRS ప్రక్రియ పెండింగ్లో ఉన్న విషయాన్ని వెల్లడించకుండా, తప్పుడు హామీలతో తన నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా మావల పోలీసులు దరాడే కేశవ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఇన్స్పెక్టర్ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
ప్లాట్ కొనుగోలుదారులకు పోలీసుల సూచన
రియల్ ఎస్టేట్ లావాదేవీల సమయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్లాట్ కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, సంబంధిత భూ పత్రాలు, సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ స్థితి, LRS అనుమతులు, ఇతర చట్టపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నగదు లావాదేవీలు చేయాలని సూచించారు.
పత్రాలను పరిశీలించకుండా, కేవలం మాటలపై నమ్మకంతో డబ్బులు చెల్లిస్తే భవిష్యత్తులో ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
