పని వదులుకుని రేషన్ బియ్యం కోసం పడిగాపులు.. అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి
తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక రేషన్ డీలర్ తలమడుగు, తాంసి రెండు మండలాలకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండటంతో తలమడుగు గ్రామంలోని రేషన్ కార్డుదారులకు బియ్యం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ
ఈ నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో రేషన్ దుకాణం వద్ద రద్దీ పెరిగిందని స్థానికులు తెలిపారు. బియ్యం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీంతో రోజువారీ పనులు, కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. పని వదులుకుని రేషన్ బియ్యం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తలమడుగుకు ప్రత్యేక డీలర్ ఉండాలి
తలమడుగు గ్రామానికి కేటాయించిన రేషన్ షాపులోనే బియ్యం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తలమడుగు గ్రామానికి శాశ్వతంగా ప్రత్యేక రేషన్ డీలర్ను నియమిస్తే కార్డుదారులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం: డీలర్
ఈ విషయమై రేషన్ డీలర్ను ‘మన భారత్’ ప్రతినిధి సంప్రదించగా.. తలమడుగు, తాంసి రెండు మండలాల బాధ్యతలు ఒకేసారి నిర్వహించడం తనకు కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.
ఇకనైనా అధికారులు సమస్యను పరిశీలించి తలమడుగు గ్రామానికి ప్రత్యేకంగా శాశ్వత రేషన్ డీలర్ను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు రేషన్ సరుకులు సులభంగా, సమయానికి అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారూ.
