ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు తెలంగాణ రక్షణ సేన కట్టుబడి ఉంటుంది: కల్వకుంట్ల కవిత
జయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు
మన భారత్ | హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా నిరంతరం కృషి చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్కు ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన జయశంకర్ సేవలు చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నిస్తూ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మేధావి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయం పాలనతో ముందుకు సాగాలని ఆయన జీవితాంతం ఆకాంక్షించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించడమే కాకుండా, ప్రతి వర్గాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తిత్వం జయశంకర్ సొంతమని ఆమె అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ తెలంగాణ సమాజానికి దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కేలా, సామాజిక న్యాయం నెలకొనేలా అభివృద్ధి జరగాలని జయశంకర్ ఆశయపడ్డారని కల్వకుంట్ల కవిత తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన పార్టీ సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
జయశంకర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మీ విశాల్ కుమార్ మన భారత్ ఎడిటర్ , తెలంగాణ జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ లతో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
