వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు..
ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
తాంసి,మన భారత్ ప్రతినిధి, జూలై 24: తాంసి మండల కేంద్రం పరిధిలోని పొన్నారి నుంచి ఖోడద్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిపోవడంతో గుంతల లోతు, వెడల్పు వాహనదారులకు కనిపించకుండా పోతున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లేదా గుంతల్లో పడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగులు, బాలింతలను ఆసుపత్రులకు తరలించే సమయంలో రహదారి పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారుతోందని స్థానికులు పేర్కొన్నారు. అత్యవసర వాహనాలు కూడా గుంతల కారణంగా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుండటంతో బాధితులకు సమయానికి వైద్యం అందడంలో ఆలస్యం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదాలు జరగకముందే మరమ్మతులు చేపట్టాలి
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రహదారి మరమ్మతులపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే రహదారి అధ్వానంగా మారినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
రహదారి దుస్థితి కారణంగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో గుంతలను పూడ్చడం తో పాటు అవసరమైన చోట శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరారు.
పొన్నారి–ఖోడద్ అంతర్రాష్ట్ర రహదారిపై తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని స్థానిక ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
