మన భారత్, ఆదిలాబాద్
రణదివేనగర్ భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం..
150 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు
ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, పోలీసు–ప్రజల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రణ దివ్యానగర్లో బుధవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు, నాలుగు ట్రాక్టర్లను పరిశీలించడంతో పాటు, నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కాంబ్లే సుభాష్ వద్ద నుంచి 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజలు మత సామరస్యాన్ని పరిరక్షించాలని, సామాజిక మాధ్యమాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు తలెత్తితే స్వయంగా జోక్యం చేసుకోకుండా వెంటనే డయల్-100 కు సమాచారం అందించాలని కోరారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, విక్రయించడం లేదా సరఫరా చేయడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ రాయితీ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం నేరమని స్పష్టం చేశారు.
రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని చట్టాన్ని గౌరవించే పౌరులుగా జీవించాలని, లేకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, సీఐలు బి.డి. ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎస్సైలు వి. విష్ణువర్ధన్, ఎస్. జీవన్ రెడ్డి, విష్ణు ప్రకాష్, హారుణ్తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
