మన భారత్ | విజయనగరం ,(దత్తిరాజేరు):
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న వరుస దొంగతనాలు గ్రామస్తుల్లో భయాందోళనకు గురిచేశాయి. గ్రామంలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు నగదు, బంగారం, వెండి సామాగ్రితో పాటు విలువైన వస్తువులను అపహరించడంతో పాటు స్థానిక శివాలయంలోనూ చోరీకి పాల్పడటం సంచలనం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా, అనంతరం క్లూస్ టీం గ్రామానికి వచ్చి సంఘటన స్థలాలను పరిశీలించింది. దొంగలు పలు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఆధారాలు సేకరించారు.
గ్రామానికి చెందిన ఉల్లి శ్రీను ఇంట్లోకి చొరబడ్డ దొంగలు నగదు, బంగారం, వెండి సామాగ్రిని అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉంచిన విలువైన వస్తువులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా గ్రామంలోని స్థానిక శివాలయంలో కూడా దొంగలు చోరీకి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న సుమారు తులం బంగారం శతమానాలు అపహరించబడినట్లు ఆలయ అర్చకులు తాతా సాయి ప్రకాష్ శర్మ తెలిపారు. ఆలయంలో జరిగిన ఈ చోరీ గ్రామ ప్రజల్లో మరింత కలకలం రేపింది.
మరో ఘటనలో వత్సవాయి నాగమణి ఇంటి కిటికీ ఫ్రేమ్ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు పర్సులో ఉంచిన సుమారు రూ.10 వేల నగదు, రూ.6 వేల విలువ చేసే వాచీతో పాటు ఇంటి బయట పార్క్ చేసిన బైక్ను కూడా దొంగిలించినట్లు బాధితులు తెలిపారు.
వేసవి తీవ్రత కారణంగా గ్రామస్థులు ఇళ్ల మేడలపై నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని దొంగలు వరుసగా ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే రాత్రిలో ఇళ్లతో పాటు దేవాలయంలో కూడా చోరీ జరగడం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, దొంగలను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సేకరించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామంలో జరిగిన వరుస దొంగతనాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
