ఆధునిక సాంకేతికతో హైదరాబాద్లో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగింత
మన భారత్, చీపురుపల్లి:
చీపురుపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జమ్మూ గౌతమి తన ఇద్దరు చిన్నారులతో కలిసి కనిపించకుండా పోయిన ఘటనలో చీపురుపల్లి పోలీసులు వేగంగా స్పందించి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల చాకచక్యమైన చర్యలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, జమ్మూ గౌతమి తన భర్తతో ఉన్న మనస్పర్థల కారణంగా కొంతకాలంగా తన తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. ఈ సమయంలో ఆమె తన ఇద్దరు పిల్లలు జమ్మూ చక్రధర్, జమ్మూ నిహాల్తో కలిసి ఉంటోంది. కుటుంబంలో అన్న, వదినల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో తాను కుటుంబానికి భారంగా మారకూడదని భావించిన గౌతమి ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుని జీవనం సాగించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చీపురుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు Cr.No 33/2026 కింద Woman and Children Missing కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గౌతమి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగించి చివరకు హైదరాబాద్లో గౌతమి తన ఇద్దరు పిల్లలతో ఉన్నట్లు గుర్తించారు.
తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీస్ బృందం ఆమెను, చిన్నారులను క్షేమంగా గుర్తించి చీపురుపల్లికి తీసుకువచ్చింది. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గౌతమికి కుటుంబ సభ్యులు అండగా ఉండాలని సూచిస్తూ ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
చాలా తక్కువ సమయంలోనే తమ కుమార్తెతో పాటు ఇద్దరు చిన్నారులను క్షేమంగా గుర్తించి అప్పగించినందుకు చీపురుపల్లి పోలీసుల పనితీరును కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీసులు వ్యవహరించారని స్థానికులు అభినందించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
