మహిళల రక్షణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ప్రత్యేక సమావేశం
మన భారత్, విజయనగరం:
డెంకాడ మండలం పరిధిలోని పెద తాడివాడ గ్రామంలోని ఎరకయ్య చెరువు వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలతో డెంకాడ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు పాల్గొని మహిళలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112 సేవలను వినియోగించుకోవాలని, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్లైన్ 181 సేవల గురించి వివరించారు.
అదేవిధంగా రహదారి భద్రతపై మహిళలకు సూచనలు చేస్తూ, వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి సహాయం చేసే వ్యక్తులకు చట్టపరమైన రక్షణ కల్పించే Good Samaritan Scheme గురించి వివరించారు. ప్రమాదాలను చూసి భయపడకుండా వెంటనే సహాయం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు “సంకల్పం 2.0” కార్యక్రమంపై కూడా అవగాహన కల్పించారు. గంజాయి రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి ప్రమాదకరమని పేర్కొంటూ, అలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళలకు సూచించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన “శక్తి” యాప్ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా వేగంగా పోలీసులను సంప్రదించవచ్చని వివరించారు. అలాగే పిల్లలపై జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.
సమావేశం అనంతరం ఉపాధి పనులు చేస్తున్న సుమారు 300 మంది మహిళలకు బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని మహిళలు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత నిర్వహించాలని కోరారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
