మన భారత్, మొగుళ్ళపల్లి:
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి వేముల సాయి చరణ్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆత్మీయంగా సన్మానించారు. గురువారం హన్మకొండలోని రామ్నగర్లో గల మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో సాగింది.
బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన తనయుడు వేముల సాయి చరణ్ గౌడ్తో కలిసి మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, విద్యార్థి సాయి చరణ్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో ప్రతిభ కనబరిచిన విషయం తెలుసుకున్న మంత్రి, విద్యార్థిని పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. “ఏం చదువుకుంటున్నావు.. పరీక్షలు ఎలా రాశావు?” అంటూ ఆప్యాయంగా పలకరించగా, సాయి చరణ్ తన విద్యా వివరాలను మంత్రికి తెలియజేశాడు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. కేవలం కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలని సూచించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కూడా అదే స్థాయిలో ప్రతిభ కనబరిచి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సాయి చరణ్కు సూచించారు.
అలాగే పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, విద్యాబోధన చేసిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సమాజంలో మంచి గుర్తింపు పొందే స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. విద్యతోనే యువత భవిష్యత్తు మారుతుందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.
మంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం పట్ల సాయి చరణ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశాడు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహం తనకు మరింత ఉత్సాహాన్ని కలిగించిందని తెలిపాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
