మన భారత్, మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో విస్తరించి సమీపంలోని గణేష్పల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 ఎకరాల మేరకు ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.
స్థానికుల సమాచారం మేరకు, విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్లముందే కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మకాల ద్వారా ఆశించిన ఆదాయం ఒక్కసారిగా నష్టపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, గాలివేగం ఎక్కువగా ఉండటంతో మంటలు మరింత విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల పెట్టుబడి పూర్తిగా నష్టమైందని రైతులు తెలిపారు.
గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనతో ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..
