మన భారత్, హెల్త్ డెస్క్:
పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్లు, జలుబు మందుల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లు, జలుబు మందులను వైద్యులు సూచించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ తరహా మందులను వాడకూడదనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల కల్తీ దగ్గు సిరప్ల వాడకం కారణంగా భారత్ సహా పలు దేశాల్లో చిన్నపిల్లల మరణాలు నమోదవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ఔషధాల నాణ్యత, వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ అంశంపై Indian Pharmacopoeia Commission (ఐపీసీ) డ్రాఫ్ట్ నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం వైద్యులు, ఫార్మాసిస్టులు సురక్షితమైన ప్రిస్క్రిప్షన్ విధానాలను పాటించాల్సి ఉంటుంది. మందుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా వైద్యుల సలహా లేకుండా పిల్లలకు మందులు ఇవ్వకూడదని సూచించారు.
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే చిన్నారుల ఆరోగ్యానికి మరింత రక్షణ లభిస్తుందని, ప్రమాదకర పరిణామాలు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
