మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయాన్ని ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమైంది.
ఈ విడతలో ప్రధానంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, సాగు ఖర్చులకు మద్దతు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయనుంది.
ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ చర్య రైతులలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది.
రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు. రెండో విడత నిధుల విడుదలతో రైతులకు సాగు పనుల్లో మరింత సౌలభ్యం కలుగుతుందని ఆశిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
