మన భారత్, తలమడుగు :
తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రజా సమస్యలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు.
సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై అధికారులు వివరాలు అందించారు. ముఖ్యంగా ఉచిత బస్సు సేవ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, షాదీ ముబారక్ వంటి పథకాల ప్రయోజనాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అయితే, అనంతరం గ్రామస్తులు తమ సమస్యలను వెల్లడి చేస్తూ అధికారులను ప్రశ్నించారు. తలమడుగు మండలంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదని, పంట బీమా అందడం లేదని, రైతుబంధు సాయం సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, రైతుల ఆత్మహత్యలు తగ్గడం లేదని తీవ్రంగా విమర్శించారు.
ఇకపోతే, రెండు మూడు సంవత్సరాలుగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందరికీ మంజూరు కాలేదని పలువురు వృద్ధులు వాపోయారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు సర్పంచ్ ప్రత్యేకంగా ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేసి, సమస్యలను రాసి అందులో వేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పంచాయతీ ప్రతినిధులు, వార్డు సభ్యులు, యువత, రైతులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు (SHG), పథకాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
