మన భారత్: తాంసి, ఆదిలాబాద్:
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తాంసి మండల కేంద్రంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు వెంకట రమణ మాట్లాడుతూ, అధికారంలోకి రావడానికి ముందు 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి మద్దతు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసనతో తాంసి ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్, యువ సర్పంచ్ ఈరగొల్ల అశోక్, రఘు, మలపతి అశోక్, అండె అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు.
