మన భారత్, హైదరాబాద్:
తెలంగాణలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో అత్యవసర చర్చ జరిపి సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం వేలాది మంది దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు పాయల్ శంకర్ కాలి నడకన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేయాలని, నెలవారీ పెన్షన్ను పెంచాలని, పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఆలస్యం లేకుండా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదనంగా, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సంఘం నాయకులు పాయల్ శంకర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. వీటిని శాసనసభలో ప్రస్తావించి పరిష్కారం సాధించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్వాయి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముక్తాపురె అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
