మన భారత్, ఆదిలాబాద్:
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (IPS) స్పష్టం చేశారు. నేరాల స్వరూపం రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం కీలకమని ఆయన పిలుపునిచ్చారు.

తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 21 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్దలు సంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. “ఒక సీసీటీవీ కెమెరా 100 మంది సిబ్బందితో సమానం” అని పేర్కొన్న ఆయన, గ్రామ స్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో సీసీ టీవీలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, చిన్నచిన్న నేరాలు, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో ఈ కెమెరాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. మహిళల భద్రత, రాత్రి వేళల్లో కదలికల పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు లో కూడా ఇవి కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు.

సీసీ టీవీల వల్ల నేరాలను ముందుగానే నిరోధించడమే కాకుండా, జరిగిన ఘటనలపై స్పష్టమైన ఆధారాలు లభించడం ద్వారా విచారణ వేగవంతం అవుతుందని ఎస్పీ వివరించారు. నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామం గంజాయి రహితంగా ఉండటం, రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి నాలుగు అంశాలను పాటిస్తే ఆ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అదే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆదర్శ యువ రైతులను సత్కరించి బహుమతులు అందజేశారు. అనంతరం కజ్జర్ల గ్రామ రామాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె. ఫణిదర్, తలమడుగు ఎస్ఐ డి. రాధిక, సర్పంచ్ ఎల్మా నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
