మన భారత్, మేఘాలయ:
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. షిల్లాంగ్ పార్లమెంట్ సభ్యుడు రిక్కీ సింగ్కోన్ ఫుట్బాల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సమాచారం ప్రకారం, మవ్లాయ్ మావివోంగ్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడేందుకు రిక్కీ సింగ్కోన్ వెళ్లారు. మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు తరలించగా అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో జైవాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు చికిత్స ప్రారంభించినప్పటికీ, కొద్ది సేపటికే ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగా మృతి జరిగి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
రిక్కీ సింగ్కోన్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విక్టరీ సాధించి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రజల మధ్య చురుకుగా ఉండే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. క్రీడలను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా పేరు పొందారు.
ఈ సంఘటనపై రాజకీయ నేతలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మేఘాలయ రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
