మన భారత్, ఆదిలాబాద్:
బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బంజారా సంప్రదాయాల ప్రకారం మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనికలతో కలిసి భోగ్ సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమాజం కొరకు ప్రతీ ఒక్కరు సమయం కేటాయించాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆచరణలు సమాజాభివృద్ధికి దారితీసే మార్గదర్శకాలని పేర్కొన్నారు. సమాజం పురోగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సమయాన్ని కేటాయించాలని పిలుపునిచ్చారు.

బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
