మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీ 3వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి నిషిధ ఖండేష్కర్ భారీ విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 856 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 482 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
3వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి బలమైన ఆధిక్యాన్ని చాటిచెప్పింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నిషిధ ఖండేష్కర్కు అభినందనలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ పారదర్శకంగా సేవలందిస్తానని నిషిధ ఖండేష్కర్ తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 3వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని బిజెపి వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
