ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్
చోరీ కోసం ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడి చేసి నగదుతో పరారీ
నల్గొండ, ఆగస్టు 20:
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువునే డబ్బుల కోసం హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే నిందితులుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
గంజాయి, జల్సాల కోసం చోరీకి పథకం
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు గంజాయికి అలవాటు పడటంతో పాటు జల్సాలకు డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. తమ అవసరాలకు డబ్బులు సరిపోకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని వారు పథకం వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 11వ తేదీ సాయంత్రం రూపారెడ్డి పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన సమయంలో నిందితులు ముందుగానే ఆమె ఇంటి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి వంటగదిలో దాక్కున్నారని పోలీసులు తెలిపారు. రూపారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు తీసి లోపలికి వచ్చిన అనంతరం ఆమె బెడ్రూమ్లోకి వెళ్లే సమయంలో వెనుక నుంచి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కత్తితో దాడి.. నగదుతో పరారీ
నిందితులు కత్తితో రూపారెడ్డిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అనంతరం ఆమె వద్ద ఉన్న హ్యాండ్బ్యాగ్లోని సుమారు రూ.2 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
హత్య అనంతరం తమ ఆనవాళ్లు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హైదరాబాద్కు వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బుతో జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
రూపారెడ్డి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర వివరాలను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించారు. చివరకు ఇద్దరు పదో తరగతి విద్యార్థులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తులో వెల్లడించే అవకాశం ఉంది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
చిన్న వయసులోనే చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడటం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? వారి రోజువారీ ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సమాజం కలిసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గురువును హత్య చేసిన ఈ ఘటన విద్యార్థుల ప్రవర్తనపై కుటుంబం, పాఠశాల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
