భీమన్న వాగు కల్వర్టు, మత్తడి వాగు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్
వరద ప్రవాహ పరిస్థితులపై అధికారులతో సమీక్ష.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
తాంసి, జూలై 30 (మన భారత): ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తాంసి మండలంలోని భీమన్న వాగు కల్వర్టు ప్రాంతం, మత్తడి వాగు ప్రాజెక్టును గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
భీమన్న వాగు కల్వర్టు వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు అధికంగా ప్రవహించే సమయంలో ప్రజలు, వాహనదారులు కల్వర్టులు, వంతెనలను దాటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మత్తడి వాగు ప్రాజెక్టు వద్ద పరిశీలన
అనంతరం మత్తడి వాగు ప్రాజెక్టు ప్రాంతాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలో నీటి మట్టం, వరద ప్రవాహ పరిస్థితులపై నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టులు, వాగులు, కాలువలు, చెరువుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనించాలని అధికారులకు సూచించారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. వాగులు, వంకలు, కల్వర్టులు, ప్రాజెక్టులు, చెరువుల వద్దకు అనవసరంగా వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో యువత అత్యుత్సాహానికి పోకుండా జాగ్రత్తలు పాటించాలని, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. వాహనదారులు కూడా రహదారులపై నీటి ప్రవాహం ఉన్నప్పుడు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో తాంసి తహసీల్దార్ గణేష్, తలమడుగు తహసీల్దార్ రాజ్ మోహన్, నీటిపారుదల శాఖ ఈఈ నరేష్, డీఈఈ శ్రీనివాస్ రావు, ఏఈఈ హరీష్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
