మన భారత్ | గజపతినగరం:
గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో తొలిసారిగా విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అధ్యాయం
70 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా నీ రీప్లేస్మెంట్
– వైద్య బృందానికి ప్రశంసలు
విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా మోకాలి మార్పిడి (క్నీ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా కార్పొరేట్ లేదా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహించే ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విజయవంతంగా జరగడం విశేషంగా నిలిచింది.
గత పదేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో వైద్యులను సంప్రదించాడు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో మాత్రమే ఈ చికిత్స అందుబాటులో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలోనే శస్త్రచికిత్స నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ జగదీష్ పర్యవేక్షణలో అనస్థీషియా వైద్యులు డాక్టర్ సాయికుమార్, డాక్టర్ దివ్య సహకారంతో ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ బెజవాడ సతీష్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను నిర్వహించింది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ శస్త్రచికిత్సలో ఉపయోగించిన ఇంప్లాంట్ ఖర్చును రోగి భరించగా, మిగిలిన శస్త్రచికిత్స నిర్వహణ, వైద్య సేవలు, ఆసుపత్రి వసతులు, చికిత్స సంబంధిత సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. దీంతో రోగికి భారీ ఆర్థిక భారం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్ల వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది పేద రోగులు చికిత్స పొందలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఇంప్లాంట్ల ఖర్చును భరిస్తే ఆర్థికంగా వెనుకబడిన రోగులకు పూర్తిగా ఉచితంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు.
గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో ఈ తరహా ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచిందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
