బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి సామాజిక న్యాయం సాధించాలి
మన భారత్, మొగుళ్ళపల్లి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసింది, ఉద్యమాల్లో ముందుండి పోరాడింది బహుజన వర్గాలేనని, అయితే రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన ఫలితాలను మాత్రం అగ్రకులాలే అనుభవిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల పరిస్థితి మెరుగుపడాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే మరింత వెనుకబడిందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, ముఖ్యంగా బహుజన వర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై కూడా స్పందించిన మహేందర్ గౌడ్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి అనేక మంది బహుజన నాయకులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. సకల జనుల సమ్మె, విద్యార్థి ఉద్యమాలు, ధూంధాం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది కూడా బహుజన వర్గాలేనన్నారు.
రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయిందని, మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో కీలక శాఖలు ఇచ్చేవారని, ప్రస్తుతం తక్కువ ప్రాధాన్యత కలిగిన శాఖలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను తగ్గించడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచారని పేర్కొన్నారు.
బీసీల సంక్షేమానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకపోవడం వల్ల అనేక వర్గాలు నష్టపోతున్నాయని అన్నారు. కార్పొరేషన్ రుణాలు, కులవృత్తుల అభివృద్ధి పథకాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ సంస్థలకు అగ్రకుల నాయకుల పేర్లు పెడుతున్నారని, బీసీ మహానీయుల పేర్లను మాత్రం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నగరంలో బీసీ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
భవిష్యత్తులో సామాజిక న్యాయం సాధించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి పదవి దక్కేలా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
