ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్
– 137 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం:
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
ఎల్.కోట మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించగా, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, ఒక్కో సమస్యను శ్రద్ధగా విన్నారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 137 వినతులు అందినట్లు వెల్లడించారు.
అందులో అత్యధికంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లకు సంబంధించి 127 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. అదేవిధంగా నూతన ఇళ్ల స్థలాల మంజూరు కోసం 4 వినతులు, విద్యుత్ సమస్యలు మరియు లో-వోల్టేజీ ఇబ్బందుల పరిష్కారం కోసం మరో 4 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజా సమస్యలకు సంబంధించి ఇతర అంశాలపై మరో రెండు వినతులు కూడా వచ్చినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాదర్బార్లో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటమే కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించే విధంగా పరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు.
ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకునే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో ప్రభుత్వంపై మరింత నమ్మకం పెంచుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాదర్బార్ కార్యక్రమం కీలక వేదికగా మారిందని వారు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
