ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
మన భారత్, ఆదిలాబాద్:
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతంపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పీడీఎస్యూ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి పట్ల పాలకులకు కనీస బాధ్యత కూడా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల భారం పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పిల్లలను చదివించుకోవడం తల్లిదండ్రులకు భారంగా మారిందని, లక్షలాది కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్ల సామాన్య ప్రజలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు విద్యా రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వదిలేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బలహీనపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, నాణ్యమైన బోధన లోపించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ప్రవేశ, ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. గత 12 సంవత్సరాల్లో నిర్వహించిన అనేక పరీక్షల్లో లీకేజీలు జరిగినట్లు పేర్కొంటూ, దీనివల్ల కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృథా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అలాగే దేశంలో మహిళల భద్రత, బాలికల రక్షణ విషయంలో కూడా పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. నేరాల నియంత్రణలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి, యువత సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వాలు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పీడీఎస్యూ నేతలు హెచ్చరించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
