మన భారత్, మొగుళ్లపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రహదారి ప్రక్కనే నిర్వహిస్తున్న మద్యం షాపు కారణంగా స్థానికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన రెండు వైన్ షాపులలో ఒకటి సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా నడుస్తుండటం తో, అక్కడికి వచ్చే వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ప్రధాన రహదారిపై తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొగుళ్లపల్లి మండల కేంద్రం జమ్మికుంట, చిట్యాల, పరకాల ప్రాంతాలకు ప్రధాన కూడలిగా ఉండటంతో ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల పార్కింగ్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది. అదనంగా, మద్యం షాపులో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం వల్ల వినియోగదారులు రహదారులపైనే మలమూత్ర విసర్జన చేయడం దుర్వాసనతో పాటు మహిళలు, స్థానిక ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది.
ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, పంచాయతీ పాలకవర్గం షాపు నిర్వాహకులకు పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ షాపు యజమానులు స్పందించకపోవడంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ సభ్యులు జిల్లా కలెక్టర్ మరియు ఎక్సైజ్ సూపరిండెంట్ను కలిసి సమస్యను వివరించారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ మద్యం షాపును సీజ్ చేసి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై స్పందించిన అధికారులు, పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
