మన భారత్ ,తిరుమల:
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శనివారం ఒక్కరోజే సుమారు 80,350 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 36,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లకు చేరింది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలను పెంచి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సహనం పాటిస్తూ, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భక్తుల రద్దీ మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
