మన భారత్, హన్మకొండ:
జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేయడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6)తో కలిసి నివాసం ఉంటూ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా తన భార్య గర్భం దాల్చిన సందర్భాల్లో ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో పలుమార్లు గర్భస్రావం చేయించినట్లు సమాచారం.
ఇటీవల ఫర్హాత్ మళ్లీ గర్భవతి కావడంతో మరోసారి అబార్షన్ చేయించుకోవాలని అజారుద్దీన్ ఒత్తిడి చేశాడు. అయితే దీనికి ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి అందులో తోసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఫర్హాత్ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అజారుద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ దారుణ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. మహిళల భద్రత, ఆడపిల్లలపై వివక్షపై మరోసారి చర్చ మొదలైంది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
