మన భారత్ ,అచ్చంపేట :
తెలంగాణలో ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సల్లేశ్వరం జాతర ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, లింగాల మండలాల పరిధిలో విస్తరించిన దట్టమైన నల్లమల అరణ్యాల్లో ఈ జాతర వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ పర్వదిన వేడుకలు కొనసాగనున్నాయి.

సల్లేశ్వరం క్షేత్రం ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్యన ప్రకృతి సోయగాలతో నిండిన ప్రాంతంలో కొలువై ఉంది. ఏడాది పొడవునా ఈ క్షేత్రం భక్తులకు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా జాతర సమయంలో మాత్రమే కొద్ది రోజుల పాటు దర్శనానికి అవకాశం కల్పిస్తారు.

హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి కొండలు, గుట్టలు దాటి అడవుల మధ్యన కష్టమైన మార్గంలో ప్రయాణించి భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని భక్తులు ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. అందుకే సల్లేశ్వరం జాతరను “తెలంగాణ అమర్నాథ్ యాత్ర”గా కూడా పిలుస్తారు.

ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కొండకోనల్లో జాలువారే జలపాతాల మధ్య ఉన్న లింగమయ్య స్వామిని దర్శించుకోవడం భక్తుల విశేష సంప్రదాయంగా కొనసాగుతోంది.
ప్రత్యేకంగా పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకం కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో జాతర రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశముంది.

భక్తుల సౌకర్యార్థం స్థానిక అధికారులు తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర మార్గాల నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
