మన భారత్: తలమడుగు:
ఇందన కొరతపై వ్యాపిస్తున్న పుకార్ల నేపథ్యంలో వాహనదారులు గందరగోళానికి గురై పెట్రోల్ బంక్ల వద్ద భారీగా చేరుకున్నారు. బుధవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామం సమీపంలోని మహారాష్ట్ర అంతరాష్ట్ర రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది.

పుకార్ల ప్రభావంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ కోసం ఎగబడి బంక్ వద్ద రద్దీ సృష్టించారు. చాలా మంది తమ వాహనాల్లో అవసరానికి మించిన పెట్రోల్ నింపించుకోవడంతో పాటు, కాలి డబ్బాల్లో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రాంతంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేయడంతో ప్రజల్లో భయం నెలకొని, అనవసరంగా బంక్ వద్ద రద్దీ పెరిగిందని తెలిపారు.

అధికారులు కూడా ప్రజలు పుకార్లను నమ్మకుండా, అవసరానికి తగ్గట్టే ఇందనాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు. ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనతో తలమడుగు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది
