మన భారత్, ఆంధ్రప్రదేశ్:
రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్య తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రతి అర్హుడైన రేషన్ కార్డు దారుకు లీటర్ చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు 2,800 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించిన విషయం తెలిసిందే. (ఒక కిలోలీటర్ = 1,000 లీటర్లు)

ఏపీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ, ప్రస్తుత గ్యాస్ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మళ్లీ కిరోసిన్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఇంధనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం లభించనుంది. గ్యాస్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీ అత్యవసర అవసరాలను తీర్చడంలో కీలకంగా మారనుందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అవసరమైన సరఫరాలు నిరంతరం కొనసాగాలని కోరుతున్నారు.
