మన భారత్, న్యూఢిల్లీ:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ వలసదారుల అంశంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే అక్రమంగా ఉన్న వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. నక్సల్స్ సమస్యను ఎలా ఎదుర్కొన్నామో, అదే విధంగా చొరబాటుదారుల సమస్యను కూడా మరో ఐదేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అస్సాంలోని కాంపూర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతకు, రాష్ట్రాల జనాభా సమతౌల్యానికి అక్రమ వలసలు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని అన్నారు. అక్రమ వలసదారుల వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా దారి మళ్లుతున్నదని పేర్కొన్నారు.

విపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన, అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఆ పని చేయరని ఆరోపించారు. కొందరు రాజకీయ పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. వారి విధానాలు అస్సాంకు ప్రమాదకరంగా మారాయని వ్యాఖ్యానించారు.
దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేయడం, పౌరసత్వ ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం, అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడం వంటి చర్యలు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో ఈ చర్యలను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు.
దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన ఆయన, చట్టబద్ధంగా నివసిస్తున్న పౌరుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ వలసల నియంత్రణ ద్వారా దేశ సమగ్రతను పరిరక్షించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
