మన భారత్, తెలంగాణ:
ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుండటంతో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.
సాయంత్రం పూజారులు చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాఘట్టం సందర్భంగా సంప్రదాయానుసారం జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇది మేడారం జాతరలో అనుసరించబడే ప్రత్యేక సంప్రదాయంగా భావిస్తారు.
ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు ఇప్పటికే భక్తులు లక్షలాదిగా మేడారానికి తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 40 లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలను అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ఆదివాసీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన మేడారం జాతర ఈ ఘట్టంతో మరింత వైభవంగా కొనసాగనుంది.
