మన భారత్, ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలే బలమని, వచ్చే రోజుల్లో వారికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఏడాదిన్నర కాలం తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చంద్రబాబు నడుపుతున్న తప్పుడు పాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
గత పాలన సమయంలో కొవిడ్ మహమ్మారి కారణంగా పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చిందని జగన్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశామని తెలిపారు. ఇకపై పార్టీ 2.0 దశలో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇస్తానని, ఇది తన హామీ అని జగన్ భరోసా ఇచ్చారు.
రానున్న రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రజల మధ్య బలంగా నిలబెట్టే బాధ్యత కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు.
