హెల్మెట్ ధరించిన వాహనదారులకు నికి పువ్వు అందించిన ఎస్సై జీవన్ రెడ్డి
హెల్మెట్ ఉంటే పువ్వు.. లేకుంటే జరిమానా!
మన భారత్, ఆదిలాబాద్:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రాంపూర్ బైపాస్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను అభినందిస్తూ గులాబీ పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఎస్సై జీవన్ రెడ్డి సూచించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
