శాశ్వత భవనం లేక రేకుల షెడ్లకే పరిమితమైన పాలన
మన భారత్, తాంసి : మండలంలోని పాలోడి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రామ అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉండాల్సిన గ్రామపంచాయతీకి ఇప్పటికీ శాశ్వత భవనం లేకపోవడంతో, రేకుల షెడ్లోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.
సుమారు ఏడాదిన్నర క్రితం గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన గుత్తేదారు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో భవనం ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల నాసిరకం ఇటుకలు తీసుకువచ్చి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా, నాణ్యతపై అనుమానంతో గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిపారు.

భవనం లేకపోవడం వల్ల గ్రామ పాలనకు సంబంధించిన సమావేశాలు, ప్రజల వినతుల స్వీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు సక్రమంగా జరగలేని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఈ సమస్యను పలుమార్లు తెలియజేసినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నిర్లక్ష్యం వహించిన గుత్తేదారిపై తగిన చర్యలు తీసుకుని పాలోడి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
