ఫూలే దంపతుల స్ఫూర్తితో సమగ్ర అభివృద్ధి దిశగా సాగాలి: మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే
మన భారత్, ఆదిలాబాద్: సామాజిక న్యాయం, స్త్రీ విద్య, సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులైన మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల స్ఫూర్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పిలుపునిచ్చారు. ఫూలే జంట 135వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఫూలే దంపతులు చేసిన మహత్తర సేవలు ఈరోజు బహుజన వర్గాలకు ఆశాకిరణాలై నిలుస్తున్నాయని సుకుమార్ పెట్కులే గుర్తుచేశారు. మాలి మరియు ఇతర బహుజన కులాల్లో అక్షరాస్యత శాతం ఇంకా తక్కువగా ఉండటం ఆందోళనకరమని పేర్కొంటూ, విద్యావంతులు ముందుకు వచ్చి విద్యావ్యాప్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫూలే దంపతుల చాటించిన మార్గం వల్లే బహుజన వర్గాలకు సామాజిక న్యాయం అందుతుందని ఆయన తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మహాత్మ జ్యోతిరావు ఫూలేను తన గురువుగా భావించారని, రాజ్యాంగ రచనలో ఫూలే ఆలోచనా ధోరణి ప్రభావమైందని సుకుమార్ అన్నారు. వారి స్ఫూర్తి మనల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించాలని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మాలి మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, మాలి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ అంబేకర్, భాస్కర్ ప్రధాన్, కార్యవర్గ సభ్యులు దేవిదాస్, పట్టణ అధ్యక్షులు శ్రీను ఆచారి తదితరులు పాల్గొన్నారు.
