అపూర్వమైన ఆరోగ్యానికి ‘ఇప్ప పువ్వు లడ్డు’ – ఉట్నూర్లో మోవా లడ్డూల తయారీ కేంద్రం ప్రారంభం
మన భారత్, ఆదిలాబాద్: ఉట్నూర్ మండల కేంద్రంలో ‘మోవా లడ్డూల’ తయారీ, విక్రయ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ తొడసం రాధాభాయ్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా స్థానికంగా తయారు చేసే ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇవి ప్రత్యేకంగా ఇప్ప పువ్వు (మహువ) తో తయారుచేసిన ఆరోగ్యకర లడ్డూలు కావడంతో ప్రజలు వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఇవి ఎంతో పోషకవంతంగా ఉండి శక్తిని అందిస్తాయని తెలిపారు. కేంద్రంలో లభించే లడ్డులు, పచ్చడ్లు, ఐటిడిఎ ఆధ్వర్యంలో తయారయ్యే సరుకులకు మొదటి బోణీ చేసి, అధికారికంగా అమ్మకాలను ప్రారంభించారు.
స్థానిక మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కేంద్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
