దేవాలయ భూముల సంరక్షణకు రేవంత్ సర్కారు సిద్ధం — కొత్త బిల్లు రాబోతోంది
ఆక్రమణదారుల పై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు సన్నాహాలు
మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ భూముల రక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, చారిటబుల్ ట్రస్టులకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్త చట్టబద్ధ మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్, 1987లోని చాప్టర్ XIలో సవరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెక్షన్ 83, 84లను రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం రూపొందించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
సర్కారు వర్గాల సమాచారం ప్రకారం, ట్రిబ్యునల్, కోర్టు కేసుల పేరిట వేల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు దోహదం కానుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు ఆక్రమణకు గురవ్వడంతో, వాటిని తిరిగి దేవాలయాల అధీనంలోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది.
దేవాలయ భూముల విలువ వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ భూములు మళ్లీ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఉపయోగపడేలా సర్కారు నడుంబిగించింది. ఎండోమెంట్స్ అధికారులకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ, అవసరమైతే పోలీసు, హైడ్రా సహకారంతో ఆక్రమణలు తొలగించే అవకాశమూ ఉంది.
మతపరమైన సంస్థల ప్రతినిధులు, హిందూ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. “దశాబ్దాలుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్న దేవాలయ భూములను తిరిగి సంపాదించడం సమాజ ధర్మం” అని పలువురు అభిప్రాయపడ్డారు.
