నాణ్యత ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ కలెక్టర్ ఆదేశాలు
మన భారత్ మెదక్ జిల్లా : రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం శివంపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
రైతులు తెచ్చిన ధాన్య నాణ్యతను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ, “ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూడాలి. మధ్యవర్తుల ప్రభావం లేకుండా కొనుగోలు జరగాలి” అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వేగంగా తరలించాలని, అలాగే రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు పూర్తి పారదర్శకతతో నమోదు చేసి, వారికి సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రతి కిలో ధాన్యం రైతు కష్టానికి ప్రతిఫలం. కాబట్టి నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, సహకార, సివిల్ సప్లై శాఖల అధికారులు పాల్గొన్నారు.
