మన భారత్, ఆదిలాబాద్:
భవిష్యత్ భారతదేశం బాలలదే.. బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ బాధ్యత వహించాలి
తాంసి: భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో బాలల పాత్ర అత్యంత కీలకమని, వారి బాల్యం చదువుకు అంకితం కావాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బిక్షాటన, పిల్లల అక్రమ రవాణా వంటి సామాజిక దురాచారాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తాంసి మండలంలోని కపర్ల గ్రామంలో శనివారం నిర్వహించిన బాల పంచాయత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల పంచాయత్ వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సమర్థవంతమైన వేదికలుగా నిలుస్తాయని అన్నారు.
పిల్లలను చదువుకు దగ్గర చేయడం, విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. పాఠశాలల్లో వేధింపులు, వివక్ష, అసమానతలకు తావు లేకుండా అధికారులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
బాల బాలికల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని, సమాన అవకాశాలు కల్పించడమే సమాజ పురోగతికి బాటలు వేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి బాలల సంక్షేమం, భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పిల్లలకు ఇళ్లలో, పాఠశాలల్లో అనుకూల వాతావరణం కల్పించాలని, తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించిన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ బాల బాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక తీర్మానాలు చేపట్టాలని సూచించారు. కుటుంబ సభ్యులు గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు బాల్య వివాహాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ఉపాధి అవకాశాలు, చదువుపై ఆసక్తి పెంపు, కుటుంబ కలహాల ప్రభావం, క్రీడల ప్రాధాన్యత, గ్రామంలో మరుగుదొడ్ల సమస్యలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. మౌనిక ఐపీఎస్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఈవో మాధవి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, డిసిపిఓ రాజేంద్ర ప్రసాద్, ష్యూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐ దాసు, కపర్ల సర్పంచ్ అరుణ్, ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, తాంసి ఎస్ఐ ఎస్. జీవన్ రెడ్డి, గ్రామ పెద్దలు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
