మన భారత్, హైదరాబాద్:
దేశ ఆర్థికాభివృద్ధి, ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు స్వావలంబన లక్ష్యాలతో ప్రజలు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా దేశ ప్రజలకు తొమ్మిది కీలక సూచనలు చేస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.
దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రధాని అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతున్నాయని, అందుకే సాధ్యమైనంత వరకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని కోరారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.
విదేశీ ప్రయాణాలను అవసరమైన సందర్భాల్లో మాత్రమే చేయాలని సూచించిన ప్రధాని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అలాగే కుటుంబాలు వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని కూడా తగ్గించవచ్చని చెప్పారు.
దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా శపథం చేయాలని ప్రజలను కోరడం విశేషంగా మారింది. అధికంగా బంగారం దిగుమతి చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతుందని ప్రధాని వివరించారు. అలాగే ఆడంబరాలు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు.
సాంకేతికతను మరింతగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. సాధ్యమైన చోట్ల ఆన్లైన్ సమావేశాలు నిర్వహించడం, వర్క్ ఫ్రం హోమ్ విధానాలను ప్రోత్సహించడం ద్వారా ఇంధన వినియోగం తగ్గించవచ్చని తెలిపారు. ఇది ట్రాఫిక్ సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై కూడా ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతులు ఎరువులు, రసాయనాల వినియోగాన్ని సగానికి తగ్గించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు పద్ధతులపై దృష్టి పెట్టడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. అలాగే రైతులు సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలని సూచించారు. సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి కుటుంబం చిన్నచిన్న మార్పులు తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అన్నారు.
హైదరాబాద్ వేదికగా ప్రధాని చేసిన ఈ సూచనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సంరక్షణ, ఆర్థిక నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
