మన భారత్, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం జక్కపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన కమలాకర్ శుభకార్యానికి వెళ్లేందుకు ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే కమలాకర్ ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు కూడా కమలాకర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విద్యుత్ పరికరాలను ఉపయోగించే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇస్త్రీ పెట్టెలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించే సమయంలో వైర్లు, ప్లగ్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని చెబుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
