ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం హర్షణీయం : దళిత సంఘాల నేతలు
మన భారత్, విజయనగరం:
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సామాజిక మార్పుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున గజపతినగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పెంట శంకర్రావు, రెళ్లి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గండ్రేటి రామారావు మాట్లాడుతూ ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకులు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని అన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం పట్ల దళిత, బడుగు బలహీన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు.
రాజకీయాల్లో సామాన్య ప్రజలకు ప్రాధాన్యత పెరగాలని, సామాజిక న్యాయం ప్రతిబింబించే విధంగా నాయకత్వ మార్పులు రావాలని వారు ఆకాంక్షించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంతకం చేయడం అభినందనీయమని అన్నారు.
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వారు సూచించారు. సంక్షేమ పథకాల అమలుతో సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవాలని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
