బైక్ను ఢీకొట్టిన డీసీఎం.. రోడ్డుపై పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు – ఇద్దరు విద్యార్థుల మృతి
మన భారత్, విజయనగరం:
విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎస్సై సన్యాసి నాయుడు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న డీసీఎం మినీ లారీ అయినాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా చింతలవలస గ్రామం వైపు రైట్ టర్న్ తీసుకుంది. అదే సమయంలో విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.
గాయాలతో రోడ్డుపై పడివున్న యువకుల్లో ఒకరిని వెనుక నుంచి వేగంగా వస్తున్న ఎరుపు రంగు స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ అదుపు కోల్పోయి గాయపడిన యువకుడిని సుమారు 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
మృతులను తాన్న హర్ష చైతన్య (19), బొబ్బిలి మండలం వెంకంపేట గ్రామానికి చెందిన విద్యార్థిగా, రెడ్డి ఉదయ్ కుమార్ (20), సీతానగరం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. హర్ష చైతన్య MVGR College of Engineering లో బీటెక్ చదువుతుండగా, ఉదయ్ కుమార్ C. R. Reddy College లో విద్యనభ్యసిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరై తిరిగి తమ గదికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం, కారు మరియు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాలను విజయనగరం ఎంఆర్ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా, హారన్ సిగ్నల్స్ ఇవ్వకుండా ఆకస్మికంగా టర్న్ తీసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే కారు డ్రైవర్ అధిక వేగంతో వాహనం నడపడం వల్ల పరిస్థితి మరింత విషాదకరంగా మారిందని వెల్లడించారు.
మృతుడు హర్ష చైతన్య తండ్రి తాన్న చినబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై సన్యాసి నాయుడు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
