డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయంలో కొత్త దిశ
-తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు
-ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి
-జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మన భారత్, ఆదిలాబాద్:
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయంలో సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, రైతులు కూడా కాలానుగుణంగా కొత్త పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్త ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన “డ్రోన్ సాంకేతికత ద్వారా నువ్వుల విత్తే విధానం” ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తూ శాస్త్రవేత్తలను వివిధ అంశాలపై ప్రశ్నించారు.
డ్రోన్ సాంకేతికత ద్వారా విత్తనాలను సమానంగా, వేగంగా చల్లవచ్చని శాస్త్రవేత్తలు కలెక్టర్కు వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ భూమిలో విత్తనాలు చల్లడం సాధ్యమవుతుందని, దీనివల్ల రైతులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. అలాగే పంటలపై మందుల పిచికారీ కూడా డ్రోన్ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఎక్కువ శ్రమతో పాటు విత్తనాల వృథా జరుగుతుందని అన్నారు. డ్రోన్ టెక్నాలజీ వినియోగంతో కూలీల కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుందని, సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ముఖ్యంగా నువ్వులు, వరి, పత్తి వంటి పంటల సాగులో డ్రోన్ వినియోగం రైతులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
రైతులకు వినూత్న వ్యవసాయ పద్ధతులను చేరువ చేయడంలో జిల్లా యంత్రాంగం, కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ అన్నారు. రైతులు కొత్త యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తక్కువ ఖర్చుతో కూడిన సాగు పద్ధతులను రైతులకు అందించేందుకు ఇటువంటి క్షేత్రస్థాయి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాంగోపాల్ వర్మ, హకా మేనేజర్ వెంకటేశ్వర్లు, జేడీఏ శ్రీధర్ స్వామి, గ్రామ సర్పంచ్ భూమన్న, రైతు కేమ లక్ష్మణ్, వ్యవసాయ అధికారి రవీందర్, పలువురు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
