మన భారత్, మొగుళ్ళపల్లి:
సైబర్ క్రైమ్ , సోషల్ మీడియా వినియోగంపై బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి. మల్లేశ్వరి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జి. మల్లేశ్వరి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, వారు సైబర్ ప్రపంచంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారాన్ని నిర్లక్ష్యంగా పంచుకోవడం ప్రమాదకరమని, అపరిచితులతో సంభాషణల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణ పెంచి, సురక్షితమైన డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్, ఎస్ఐ ముప్పు సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవత, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిలర్లు మాధవి, అనూష, మమత, కళావతి, అంగన్వాడీ టీచర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలకు సైబర్ భద్రతపై సరైన అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలు, వేధింపులను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
