మన భారత్ , జైనథ్:
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో 17 ఏళ్ల బాలిక అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురైంది.
స్థానికుల వివరాల ప్రకారం, ఆదివారం మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది కార్తీక్ సింగ్, విట్టల్ గౌడ్ తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని బాలికకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషయంలో వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చిన్న విషయాలకే యువత తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరమని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పిల్లలతో సానుకూలంగా మెలగాలని, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
