మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మెపై TSDF తీవ్రంగా స్పందించింది. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని TSDF చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న పోరాటమని TSDF స్పష్టం చేసింది. వేలాది మంది కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళనకరమని పేర్కొంది.
కార్మికులు ప్రస్తావిస్తున్న ప్రధాన డిమాండ్లలో RTC ను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, వేతన సవరణలు అమలు చేయడం, పెన్షన్ హక్కులు ఇవ్వడం ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు దారితీసే విధానాలను నిలిపివేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపకుండా సమ్మెను అణచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని TSDF విమర్శించింది. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఆందోళనకరమని పేర్కొంది.
RTC సంస్థ గ్రామీణ ప్రాంతాలకు జీవనరేఖగా నిలుస్తోందని, లక్షలాది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నదని TSDF గుర్తుచేసింది. ఇలాంటి కీలక సంస్థను బలహీనపరచడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని హెచ్చరించింది.
తెలంగాణ ప్రజలు RTC కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని TSDF పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకు వచ్చి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరింది.
అదేవిధంగా, ఉద్యమంలో పాల్గొంటున్న కార్మికులు ఎలాంటి ఆత్మహానికీ పాల్పడకుండా, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
