మన భారత్, జాజాపూర్:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జాజాపూర్లో గురువారం తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా ఉత్తమ విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఆదర్శ కమిటీ చైర్మన్ మణెమ్మ కిరీటాలు ధరింపజేసి, ప్రగతి పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా పోటీతత్వంతో చదువులో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించబడుతోందని, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం సమగ్రంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా వేసవి కాలంలో విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండలోకి వెళ్లనివ్వకూడదని, తలకు టోపీ లేదా తువ్వాలు కట్టుకోవాలని, రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగించాలని సూచించారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలని తెలిపారు.
వేసవి సెలవుల్లో పిల్లలను మొబైల్, టీవీకి ఎక్కువగా అలవాటు చేయకుండా, రోజుకు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించాలన్నారు. చిత్రలేఖనం, కథల పుస్తకాలు చదవడం, ఇంటి పనుల్లో సహాయం చేయించడం వంటి మంచి అలవాట్లు అలవర్చాలని సూచించారు. అలాగే చెరువులు, కాలువల దగ్గరికి ఒంటరిగా వెళ్లనివ్వకూడదని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతూ, మంచి అలవాట్లు నేర్పిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రతాప్, మధుసూదన్, మంగళ, భాను ప్రకాష్, లక్ష్మణ్, నిర్మల, నరసింహ, నర్సింలు, శశిరేఖ, శ్రీదేవి, శిరీష, వెంకటేష్ తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
